తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు నేడు ప్రభుత్వ విప్, శాసన సభ్యుడు ఆరేకపూడి గాంధీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ వెస్ట్ జోన్ పరిధిలో న్యాయబద్దంగా అన్ని రకాల పర్మిషన్లు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా న్యాయబద్దంగా తమ ప్రాంతం పరిధిలో భవనాలు నిర్మిస్తే చలానాలు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.
భవన నిర్మాణ సామగ్రి ని వాడకుండా భవన నిర్మాణం ఎలా చేపడుతారని వారు ఆవేదన వ్యక్తం చేసారు. అదేవిధంగా అక్రమ కట్టడాలు వదిలేసి సక్రమ నిర్మాణాలు జరిగే చోట ప్రతి నెల ఒక్కొక్క బిల్డింగ్ కు నాలుగు /ఐదు సార్లు GHMC అధికారులు చలానాలు రాస్తున్నారని వారన్నారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిర్మాణానికి సంబంధించిన ఇసుక, కంకర, సిమెంట్, ఇటుకలు ఉంచినా చలానాలు వేస్తున్నారని, రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC ) వాహనాలు ఉన్నా చలానాలు రాస్తున్నారని చెప్పారు.
తమను అన్ని రకాలుగా మానసిక వేదనకు గురి చేస్తున్నారని నిర్మాణదారులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొన్న జరిగిన GHMC కౌన్సిల్ సమావేశంలో కూడా కార్పొరేటర్లు అందరూ చలానాల పై ముక్తకంఠం తో ప్రశ్నించారని వారన్నారు. అందువల్ల చలానాలు లేకుండా చూడాలని, తమకు సరైన న్యాయం చేయాలనీ వెస్ట్ జోన్ బిల్డర్స్ ప్రతినిధులు ఎమ్మెల్యేకి తెలియచేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ భవన నిర్మాణం దారులకు ఇబ్బంది కల్గకుండా చూస్తానని, చలనాల సమస్యను, క్రింది స్థాయి అధికారుల ప్రవర్తన వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని రకాల పర్మిషన్ తీసుకోని నిర్మిస్తున్న భవన నిర్మాణదార్లకు ఇబ్బంది కల్గకుండా చూస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పు సుబ్బయ్య, యం.ప్రేమ్ కుమార్, కే వీ ప్రసాద్, వడ్డేపల్లి రంగారావు, నెహ్రు, మన్నే రవి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.