కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు భవన నిర్మాణాలు అందని ద్రాక్షగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుక ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని అంటాయని ఆయన అన్నారు. ఇండ్ల నిర్మాణాల ముడిసరుకుల ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనాయని ఆయన ఆరోపించారు.
అదే విధంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఏపీ కి అత్యంత ప్రమాదకరమని కూడా ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం ఏపీ కి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రంలో ఎన్నో స్టీలు సిమెంటు లాంటి ఎన్నో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు పెట్టుబడిదారులు “క్యూ” కట్టేవారని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, సరసమైన ధరలకు అన్ని వర్గాల ప్రజలకు ఇంటి నిర్మాణపు వస్తువులు అందుబాటులో ఉండేదని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్లి పోతున్నాయని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు రాజ్యసభ సభ్యులు ప్రత్యేక హోదా పై జెండాలు అజెండాలు పక్కనబెట్టి గళం విప్పాలని ఆయన కోరారు.
బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటిందని, దీని ప్రభావం రవాణా వ్యవస్థలపై పడడంతో భవన నిర్మాణ మెటీరియల్స్ తో పాటు నిత్యావసర ధరల వస్తువులు ఆకాశాన్నంటాయని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిమెంటు స్టీల్ ఇతర ముడిసరుకుల కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి డిమాండ్ సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆయన తెలిపారు.