బతికి ఉన్నప్పుడు ఆక్సిజన్, ఆసుపత్రిలో బెడ్లు, మందులు ఇవ్వలేని జగన్ ప్రభుత్వం కరోనా తో చనిపోయిన వారి అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేయడం లేదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
మాఫీయా లాగా తయారైన కొందరు కరోనా మృతదేహాల దహనానికి డబ్బులు దండుకుంటుంటే జగన్ ప్రభుత్వం చేతగాక చూస్తూ కూర్చున్నదని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కరోనా శవాలను స్మశాన రాబందులు పీక్కుతింటున్నాయని ఆయన అన్నారు.
15వేలు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని చెబుతున్నారని, చికిత్సకే డబ్బుల్లేక అల్లాడుతున్న జనం చనిపోయిన తర్వాత ఇంత పెద్ద మొత్తం ఎలా భరిస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ సర్కార్ కు చేతగాక పోతే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
శవాలను దహనం చేయడానికి15వేలు నుండి 25 వేలు
చిలకలూరిపేట స్మశానం లో కరోనా రోగుల శవాలను దహనం చేయడానికి15వేలు నుండి 25 వేలు వరకు వసూలు చేస్తున్నారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం కు బాధితులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఉదయం లయన్స్ క్లబ్ స్వాధీనం లో ఉన్న పాత మార్కెట్ యార్డ్ ప్రక్కన ఉన్న స్మశానవాటికలో పని చేస్తున్న భాను అనే వ్యక్తి తో రావు సుబ్రహ్మణ్యం ఫోన్ చేసి మాట్లాడారు.
మా మామ గారు కరోనా తో చనిపోయారని దహన కార్యక్రమం చేయాలని ఎంత అవుతుంది అని అడగ్గా 15 వేలు దహనం చేసేందుకు,4200 లయన్స్ క్లబ్ కు ఇవ్వాలని,అంబులెన్స్ కు సేపరేట్ గా మాట్లాడుతామని డబ్బులు డిమాండ్ చేశాడు.
అంత ఇవ్వలేమని వేరే స్మశానానికి తీసుకుని వెళతామని చెప్పగా అక్కడయితే20వేలు లేక 25వేలు చెల్లించాలి అని భాను సమాధానం చెప్పడంతో తరువాత మాట్లాడుతామని రావు సుబ్రహ్మణ్యం ఫోన్ పెట్టివేశారు.
తరువాత భాను ఫోన్ చేసి 10వేలు నుండి 6 వేలుకు దిగివచ్చాడు. చిలకలూరిపేట లో అధికార పార్టీ నేత కుటుంబ సభ్యుడు చనిపోతే వారినుండి కూడా ముక్కుపిండి 15 వేలు వసూలు చేశారు. ఉచితంగా ఖననం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు స్మశాన మాఫియా కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో ముఖ్యమంత్రి జగన్ ఆలోచించాలి.
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని,ఎమ్మార్వో, మునిసిపల్ ఛైర్మన్, మునిసిపల్ కమీషనర్ కు తెలియకుండా ఈ మాఫియా వేళ్లూనుకుని ఉంటే వెంటనే స్పందించి ఉచితంగా దహన సంస్కారాలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని లేకుంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లు చేయాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
కోవిడ్ ఆసుపత్రిలో తనిఖీలు చేసిన అధికారులు ఏమి చర్యలు తీసుకున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. 2 డోసులు ఉచితంగా వేసి మిగతా డోసులు ఆసుపత్రిలో ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటోన్న విషయాన్ని ఎందుకు అరికట్టేందుకు ముందుకు రావడం లేదని జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.
వ్యాక్సిన్ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి అధిక ధరలు వసూలు చేస్తున్న మాఫియా ను అరికట్టాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఆక్సిజన్ మాఫియా కు పాల్పడుతున్న వారిపై ,కరోనా స్మశాన రాబందులు పై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే కరోనా మృతదేహలతో ప్రభుత్వ కార్యాలయాలు ముందు ప్రజలతో కలిసి నవతరం పార్టీ ధర్నాలు నిర్వహించాల్సి వస్తుందని రావు సుబ్రహ్మణ్యం ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.