రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూమిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం నడుంకట్టింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ శనివారం నాడు తొలి సారిగా భేటీ అయింది.
పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్ తో క్యాబినెట్ సబ్ కమిటీ నియమించారు.
ఈ కమిటీ తొలి సమావేశం బూర్గుల రామకృష్ణారావు భవన్ లో నేడు జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శోభ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
రెండు గంటలకు పైగా పోడు భూముల సమస్య – పరిష్కారం, పర్యావరణ – పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ, ఆర్. ఓ.ఎఫ్.ఆర్ చట్టం అమలు, గిరిజనులు, గిరిజనేతరుల హక్కులను కాపాడడం పై కమిటీ క్షుణ్ణంగా చర్చించింది. ఈ నెల 24వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.