వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘు రామకృష్ణ రాజు పార్టీ నుంచి సస్పెండ్ కావడం తథ్యం అంటూ చిత్తూరు లోక్ సభ సభ్యుడు ఎన్ రెడ్డెప్ప చెప్పడం హాస్యాస్పదమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సస్పెండ్ కావడం ఆయన స్వయం కృతాపరాధమే అనడం కూడా విడ్డూరమేనని ఆయన అన్నారు. అసలు రఘురామకృష్ణంరాజును బహిష్కరించే దమ్ము జగన్ రెడ్డికి ఉందా అని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను గూర్చి అడిగినందుకే జగన్ ఆయనపై కక్ష కట్టి వేధిస్తున్నారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
స్వంత పార్టీ ఎంపీపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసుల చేత కొట్టించిన వైకాపాకు నీతులు మాట్లాడే అర్హత లేదన్నారు.
రఘు రామను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తున్నదని చెప్పడంలో అర్థం లేదన్నారు.
జగన్ బెయిల్ రద్దు కోరడం వెనుక టీడీపీ హస్తం ఉందని చెప్పడం ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనమని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైకాపా అంతర్గత గొడవలకు టిడిపికి ఏమి సంబంధమని ప్రశ్నించారు.
పవర్ ప్లాంట్ల నిర్మాణం పేరుతో రఘురామ వేల కోట్లు మోసాలకు పాల్పడినట్లు నెత్తి నోరూ బాదుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ విషయం టిక్కెట్టు ఇచ్చేటపుడు తెలియదా అంటూ ప్రశ్నించారు.
లోక్ సభ లో రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించడం కుదరకపోవడంతో ఇప్పుడు బహిష్కరణ అంటున్నారని వ్యాఖ్యానించారు.
వైకాపా ఎంపిలు జగన్ బానిసల్లా మిగిలి పోకుండా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని సుధాకర్ రెడ్డి హితవు పలికారు.