1 నుండి 8వ, తరగతుల ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలను దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నాలు మానుకోవాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం స్థానిక విలేకరులతో టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న మైనార్టీ విద్యార్థుల ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలపై సందిగ్ధం నెలకొన్నదని,ఈ విద్యా సంవత్సరంలో మైనార్టీ సంక్షేమ శాఖకు వచ్చిన ఉపకార వేతనాల దరఖాస్తుల్లో 9,10 తరగతుల విద్యార్థులవి మాత్రమే పరిష్కరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు కారణమని అన్నారు.దీనిపై పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని,ఈ ఉపకార వేతనాల కోసం రాష్ట్రంలో 1-10 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దాదాపు 1.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, తెలంగాణకు ఈ కోటా కింద కేంద్రం ఏటా 65 వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేస్తోందని అన్నారు.
ఇందులో 40-50 వేల మందిపై ప్రభావం పడనుందని,1 నుండి 5వ, తరగతి విద్యార్థులకు ప్రతి నెలా 100 రూపాయల చొప్పున,5 నుండి 10వ, తరగతి విద్యార్థులకు 350 రూపాయల చొప్పున సంవత్సరంలో 10 నెలల పాటు చెల్లిస్తోందని,దీంతో పాటు ఏడాదికి ప్రవేశ ఫీజు కింద 500 రూపాయలు,పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద ప్రతి నెలా మరో 100 రూపాయలు చొప్పున ఇస్తోందని,ఈ ఏడాదికి దరఖాస్తులు తీసుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నోటీసు జారీ చేసిందని అన్నారు.బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానం ద్వారా విద్యను దూరం చేస్తూ విద్య కాషాయీకరణ,ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర దాగి ఉందని మహ్మద్ అజీజ్ పాషా ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యాహక్కు చట్టం కింద 1 నుంచి 8వ,తరగతి వరకు ప్రభుత్వమే ఉచితంగా ప్రాథమిక విద్యను అందించాలని,తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు కొనసాగింపు విద్య క్రింద ఫ్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను సామాజిక న్యాయశాఖ,గిరిజన మంత్రిత్వ శాఖలు అందిస్తున్నాయని,ఇదే తరహాలో మైనార్టీ మంత్రిత్వ శాఖ పరిధిలో తొమ్మిది, పది విద్యార్థులకు మాత్రమే ఫ్రీ-మెట్రిక్ ఉపకారవేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని,ఈ మేరకు ఆ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులు మాత్రమే పరిశీలించాలని రాష్ట్రస్థాయి,జిల్లా నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని, దీంతో ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనార్టీ, 1 నుండి 8వ,తరగతి విద్యార్థులందరూ కేంద్ర మైనార్టీ శాఖ ఉపకార వేతనాలకు దూరం చేసే కుట్రను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని,ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ను అందరికీ ఇవ్వాలని అజీజ్ పాషా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముషం సత్యనారాయణ, మహమ్మద్ రజాక్ బాబా,దొంతగాని జగన్, ముత్తయ్య,గోపి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్