హైదరాబాద్ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో అధికార పార్టీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో తలమునకలైపోయారు. తమకు కాకపోతే తమ ఇంట్లోని వారికి ఆ పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన ముఖ్య నేతలంతా తమ భార్య లేదా, కోడలు వారూ కుదరకపోతే కూతుళ్లకు దక్కేలా ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో పాలనా పరంగా కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తన కోడలు మహితను మేయర్ పోటీలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి తలసాని కుమారుడు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే విధంగా హైదరాబాద్ లో మరో పెద్ద నాయకుడు మంత్రి చామకూర మల్లారెడ్డి తన కుమార్తె మమతను మేయర్ బరిలో దించాలని ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె విజయలక్ష్మి గత జీహెచ్ఎంసి ఎన్నికలలోనే మేయర్ రేసులో ఉన్నారు. ఆమె కార్పొరేటర్ గా విజయం సాధించినా వివిధ కారణాల వల్ల ఆమెకు మేయర్ పదవి దక్కలేదు.
దాంతో ఈ సారి ఆమె తానే ప్రధాన అభ్యర్ధిని అవుతానని ఆశిస్తున్నారు. అదే విధంగా సీనియర్ నాయకుడు దివంగత నేత పి. జనార్ధన్ రెడ్డి కుమార్తె విజయ కూడా గత ఎన్నికలలోనే మేయర్ పదవిని ఆశించారు కానీ దక్కలేదు. ఇప్పుడు జనరల్ మహిళకు పదవి రిజర్వు అయినందున తనకు అవకాశం వస్తుందని అనుకుంటున్నారు.
ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ తన భార్య శ్రీదేవిని మేయర్ బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారు. మరో సీనియర్ నాయకురాలు, రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కోడలు స్రవంతిని మేయర్ బరిలో దించే అవకాశం కూడా ఉంది.