సామాన్య ప్రజల భద్రత కోసం చేపడుతున్న కార్డన్ అండ్ సెర్చి తనిఖీలు విశేషంగా ఫలితాలను ఇస్తున్నాయి. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డే పెల్లి, బోరిగాం తండాలలో నేడు పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చిలో సరైన పత్రాలు లేని 30 మోటారు సైకిళ్లు, రెండు ఆలోలు, అనుమతి లేని మద్యం సీసాలు, గుడుంబా, పెద్ద ఎత్తున కలప పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
2000 లీటర్ బెల్లం పానకం ఈ సందర్భంగా ధ్వంసం చేశారు. నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం కోసం కార్డన్ అండ్ సెర్చి చేపట్టామని అన్నారు. దీనివల్ల ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఆయన అన్నారు.
నేర రహిత గ్రామలుగా చేయలనే ఉద్దేశ్యంతో ఇలా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు, వ్యాపారస్తులు, గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన అమాయకులైన ప్రజలను కేసుల నుండి రక్షించవచ్చు, గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్.సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.
మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో హెల్మెట్ లేక కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారని ఆయన గుర్తు చేశారు. గ్రామంలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని లేదా నిర్మల్ జిల్లా వాట్స్అప్ నెంబర్ 8333986939 లేద డయల్ 100 కాల్ కు ఫోన్ చేస్తే చర్యలు చేపడతామని అన్నారు.
ఈ తనిఖీలో జిల్లా అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, డి.యస్.పి ఉపేందర్ రెడ్డి, సి.ఐ.లు, జాన్ దివాకర్, జీవన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.