కరోనా వైరస్ సంగతి ఏమో కానీ ఫోన్ చేయాలంటే భయం పుడుతున్నది. ఎన్ని సార్లు ఫోన్ చేస్తే అన్ని సార్లు కరోనా మెసేజ్ రావడం వినియోగదారులకు విసుగు పుట్టిస్తున్నది. ఎవరికి ఫోన్ చేసినా మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఇంగ్లీష్ లో కోవిడ్–19 వైరస్ గురించి ఉపన్యాసం ప్రసారం అవుతున్నది.
ఆ తర్వాత కాలర్ రింగ్ టోన్ వస్తున్నది. దీంతో ఫోన్ ముట్టుకోవాలంటే కరోనా వైరస్ వచ్చినంత భయం కలుగుతున్నది. అర్జెంట్ ఫోన్ కాల్స్ చేయాలంటే 30 సెకన్ల కరోనా మెజేసి ఆ తర్వాత మరో 30 సెకన్ల పాటు రింగ్ కావడంతో ఫోన్ చేసిన తర్వాత ఒక నిమిషం సేపు వేచి ఉండాల్సి వస్తున్నది.
ఫోన్ చేసిన తర్వాత కీ ప్యాడ్ పై ఒకటి నొక్కితే కరోనా మెసేజ్ కట్ కావాలి కానీ అలా కట్ కావడం లేదు. దాంతో కాల్ చేసిన ప్రతి సారీ కరోనా సోకినంత భయం పుడుతున్నది. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ల మొబైల్ వినియోగదారులకు కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధం మెసేజ్ వినిపిస్తున్నది.
కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా కాలర్ ట్యూన్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఇంగ్లీష్ లో ప్రజలను గజిబిజి చేసే విధంగా సమాచారం ఇవ్వడం కాలయాపన తప్ప ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి.
అంతే కాకుండా కాలర్ ట్యూన్లో చెప్పే టోల్ ఫ్రీ నంబర్ 01123978046 పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కాలర్ట్యూన్ వలన రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ ట్యూన్తో పాటు కాల్ కనెక్ట్ కావడం లేదని, ఈ ట్యూన్ పూర్తయ్యాకే మనం ఫోన్ చేసిన వ్యక్తికి లైన్ కలుస్తుండటంతో చాలా టైమ్ వేస్ట్ అవుతోందని, పదేపదే అదే ట్యూన్ వినడం విసుగుపుట్టిస్తోందని మెజార్టీ మొబైల్ వినియోగదారులు అంటున్నారు.
మరో ముఖ్యమైన సమస్య ఏమిటంటే కాలర్ ట్యూన్ ఇంగ్లిష్లో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అర్థం కాక ఫోన్ కలవడం లేదంటూ కట్ చేస్తున్నారు. మొబైల్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా, నెట్వర్క్ సమస్యతో ఫోన్ కలవకపోయినా సదరు వినియోగదారుడికి కూడా ఆ నెట్వర్క్ ప్రతినిధులు ఇంగ్లిష్లోనే వివరిస్తుంటారు.
ఇప్పుడు కోవిడ్ కాలర్ ట్యూన్ కూడా ఇంగ్లిష్లోనే వస్తుండటంతో ఫోన్ కలవడంలో సమస్య ఉందని, అందుకే ఎవరో ఇంగ్లిష్లో చెబుతున్నారనే భావనతో గ్రామీణ నిరక్షరాస్యులు ఫోన్ కట్ చేస్తున్నారు.