ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ జూన్ 24, 25 తేదీల లోపు కనుమరుగైపోతుందని పవిత్ర తిరుపతి క్షేత్రం లో ఉన్న ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త చక్రధర్ సిద్ధాంతి అంచనా వేశారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయన వేసిన అంచనాలు ఇప్పటికే చాలా వరకూ కరెక్టు అయ్యాయి. డిసెంబర్ 26న సంభవించిన సూర్యగ్రహణం సందర్భంగా ఏర్పడిన షష్టిగ్రహ కూటమి, సంక్రాంతి పురుషుడు గాడిదపై రావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుకోని అనారోగ్య ప్రభావంతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని ఆయన సత్యం న్యూస్ కు గతంలో తెలిపారు.
డిసెంబర్ 25, జనవరి 14 తేదీలలో ఆయన అంచనాలను సత్యం న్యూస్ పోస్టు చేసింది. కరోనా వైరస్ విజృంభించడం ఇందులో భాగమేనని ఆయన నేడు సత్యం న్యూస్ కు వివరించారు. అయితే కరోనా వైరస్ అదుపులోకి వస్తుందని తర్వాతి రోజుల్లో కరోనా వైరస్ కన్నా భయానకమైన అంటువ్యాధి ప్రబలుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు జరిగిన నష్టానికి పది రెట్లు అధికంగా ఉండే ఆ మహ్మమ్మారి నుంచి రక్షణ పొందాలంటే ధన్వంతరి హోమాలు చేయాలని ఆయన తెలిపారు.
శ్రీవికారి నామ సంవత్సరం వెళుతూ వెళుతూ మరిన్ని ఉపద్రవాలను తీసుకువస్తుందని, సమాజంలో శాంతి లోపిస్తుందని ఆయన అన్నారు. వచ్చే శార్వరీ నామ సంవత్సరంలో శుభాలు జరుగుతాయని చక్రధర్ సిద్ధాంతి వెల్లడించారు. ప్రకృతి ఈ విధంగా ప్రకోపించడానికి కారణం షష్టిగ్రహ కూటమి తర్వాతి పరిణామాలేనని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు మరిన్ని విపత్తులు ఎదుర్కొంటాయని ఆయన తెలిపారు.
సంభవించబోయే పశు నష్టం అపారంగా ఉంటుందని ఆయన తెలిపారు. సూర్య గ్రహణం సందర్భంగా అప్పటిలో తాను ముందే చెప్పినట్లు ఇప్పటి నుంచే ఎండలు మండిపోతున్నాయని చక్రధర్ సిద్ధాంతి గుర్తు చేశారు. మండే ఎండలు మరింత తీవ్రమై జన నష్టం జరిగే ప్రమాదం కూడా పొంచి ఉందని అందువల్ల అందరూ ఇష్టదైవాన్ని స్మరించుకోవాలని చెప్పారు. క్రమం తప్పకుండా హోమాలు చేయించుకుంటూ ఉపద్రవాల నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయన తెలిపారు.