కరోనా సమయంలో కూడా వైసీపీ నాయకులు నేరుగా ఫ్యాన్ గుర్తు, వై ఎస్ జగన్ ఫొటోలు వేసి డబ్బులు పంచుతున్నా పట్టించుకోని పోలీసులు తెలుగుదేశం పార్టీ కొందరు పేదవారికి సాయం చేస్తే పోలీసులు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు.
లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలన్న లక్ష్యంతో నగర టిడిపి అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నిత్యావసర సరుకుల కిట్లను పంచి పెడుతూ కిట్ల పై టిడిపి స్టిక్కర్ అంటించారన్న కారణంతో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
ఇది అధికార పార్టీ విశృంఖలత్వానికి నిదర్శనమని, నిరంకుశత్వానికి పరాకాష్ట అని వార్నారు. నిత్యావసర సరుకుల పేరిట అధికార పార్టీ నేతలు చేసే ప్రచారం పోలీసులకు కనిపించడం లేదా ? అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం… ప్రతిపక్ష పార్టీ నేతలకు మరొక న్యాయమా? అని వారు ప్రశ్నించారు.
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ విషయం గుర్తు చేస్తూ టిడిపి నేతలు సాయం చేసేందుకు ముందుకు వస్తుంటే వింత కారణాలతో అడ్డుకుంటున్నారని వారన్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పై పెట్టిన అక్రమ నాన్ బెయిలబుల్ కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.