యశోద చిత్ర బృందంపై ప్రశాంతి సెంటర్ ఫర్ పెర్టిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పరువు నష్టం దావా వేసింది. వారి సంస్థకు చెందిన ఇవ-ఐవీఎఫ్ ఆస్పత్రి పేరును దుర్వినియోగం చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమా చిత్రీకరించారంటూ ఇవ యాజమాన్యం బాధ్యులు మోహన్, డా, ప్రశాంతి తెలిపారు. ప్రశాంతి సెంటర్ ఫర్ పెర్టిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఇవ-ఐవీఎఫ్ ఆస్పత్రి పేరును దుర్వినియోగం చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగించిన యశోద చిత్ర నిర్మాత, దర్శకులు, నటిపై పరువునష్టం దావా వేశామన్నారు. చిత్రాన్ని నిర్మించిన శ్రీదేవి ప్రొడక్షన్స్, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకులు హరీశ్ నారాయణ, హరిశంకర్, నటి సమంత ఉద్దేశపూర్వకంగానే తమ ఆస్పత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశామని, ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో ఈ చిత్రం విడుదలైనందున ప్రదర్శనను నిలిపివేయాలని కోరామన్నారు.
ఓటీటీ ప్లాట్ఫాంపై విడుదల కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ఆ పిటిషన్లో అభ్యర్థించామని, తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న గౌరవ రెండవ అదనపు చీఫ్ జడ్జి డిసెంబరు 30వ తేదీ వరకు ఓటీటీ ప్లాట్ఫారంలలో ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఉత్తర్వులను జారీచేశారన్నారు. సమంత హీరోయిన్గా నటించిన యశోద చిత్రంలో ఇవ-ఐవీఎఫ్ పేరును పలుచోట్ల ప్రస్తావించడంతో పాటు దృశ్యాల్లోనూ ఈ పేరుతో ఆస్పత్రిని చూపించారని, నిర్మాత, దర్శకులు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఉల్లంఘనలకు పాల్పడ్డారని,. తమ ఆస్పత్రి ట్రేడ్ మార్కు రిజిస్టర్ అయినా తమకు తెలియకుండానే చిత్రంలో దానిని పోలిన దృశ్యాలను చిత్రీకరించారని ఆరోపించారు.
సరోగసీ స్కామ్ను వెలికితీసే ఇతివృత్తంతో పోలీసు ఆఫీసర్ పాత్రలో నటి సమంత చుట్టూ తిరిగే ఈ చిత్రంలో తమ సంస్థ పేరు ప్రతిష్టలకు భంగం కలిగే మాటలు, దృశ్యాలను ఉద్దేశపూర్వకంగానే వాడుకున్నారు. ఫలితంగా మా ఇవ-ఐవీఎఫ్ గౌరవ ప్రతిష్టలకు నష్టం వాటిల్లింది. ఈ కారణంగానే నటి సమంతతో పాటు శ్రీదేవి ప్రొడక్షన్స్, నిర్మాత, దర్శకులపై పరువునష్టం దావా వేశామని చెప్పారు. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫాంపై త్వరలో విడుదల చేయాలని నిర్మాత, దర్శకులు భావిస్తున్నందున గౌరవ కోర్టును ఆశ్రయించి ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం ద్వారా తమకు తీరని నష్టం వాటిల్లిందని, ఓటీటీ ప్లాట్ఫారంలోనూ విడుదలైతే మరింత చేటు చేస్తుందనే పిటిషన్లోని తమ ఆవేదనకు గౌరవ కోర్టు సానుకూలంగా స్పందించి డిసెంబరు 30వ తేదీ వరకు విడుదల చేయవద్దని ఆదేశించిందన్నారు.
తమ పిటిషన్లో జీ-ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, అర్హ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆహా), నోవీ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (డిస్నీ ప్లస్ హాట్స్టార్), నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియా ఎల్ఎల్పీ, అమెజాన్ ఇండియా, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూట్యూబ్ సంస్థలకూ విజ్ఞప్తి చేశామని, తమ పిటిషన్లో వాటిని ప్రతివాదులుగానూ పేర్కొన్నామని వెల్లడించారు.