బిచ్కుంద మండల కేంద్రంలో ముప్పై మంది వలస కూలీలకు మనిషికి పన్నెండు కిలోల బియ్యం ఐదు వందల రూపాయల నగదును తహసీల్దార్ వెంకట్రావు అందజేశారు. మూడు మాసాల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకా మంగళగి గ్రామం నుండి ఎనిమిది కుటుంబాలు బిచ్కుంద మండల కేంద్రానికి వలస వచ్చాయి.
వీరి జీవన వృత్తి శుభకార్యాలలో వంట తయారీకి వాడే గరిటెలు తయారుచేసి ఇంటింటికి తిరిగి అమ్ముకుని జీవనం కొనసాగిస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తమై రాకపోకలను స్తంభింప చేయడంతో వీరి జీవనం స్తంభించిపోయింది.
అటు ఇంటి కెళ్లలేక ఇటు బయటకెళ్లి వ్యాపారం చేయలేక పోవడంతో వారు మంగళవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆయన ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి వారి ఆదేశానుసారం ఎనిమిది కుటుంబాల్లో ముప్పై మందిని గుర్తించి ఒక్కొక్కరికి పన్నెండు కిలోల చొప్పున బియ్యం, ఐదువందల రూపాయల నగదును అందజేశారు.
ఆపత్కాల సమయంలో తమకు బియ్యం నగదును అందజేసినందుకు వారు రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తోపాటు ఉపతహశీల్దార్ మునిరోద్దిన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా, గ్రామ రెవెన్యూ అధికారులు శ్రీహర్ష రవి, రేషన్ డీలర్ రామ్ చందర్ రెవెన్యూ సిబ్బంది వలస కూలీల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.