జడ్జిలను తిట్టిన, కొట్టిన కేసుల్లో కూడా స్పందించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లో సీబీఐ అడుగు ముందుకు వేసింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసుకు సంబంధించి అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నది.
సీబీఐ వేగం పెంచడంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను అత్యంత దారుణంగా కించపరచడమే కాకుండా వారి తీర్పులకు కారణాలు ఆపాదిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
జడ్జీలను వ్యక్తిగతంగా దూషిస్తూ ఫేస్ బుక్, వాట్సయాప్ లలో విపరీతంగా ప్రచారం చేశారు. చంద్రబాబునాయుడు చెప్పిన విధంగానే తీర్పులు ఇస్తున్నారంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 94 మంది పేర్లను గుర్తించి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆ జాబితాను అందచేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
అయితే ఏపి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో కేసును సీబీఐకి అప్పగించాలా అని హైకోర్టు అడగడంతో ఏపీ పోలీసులు ఇచ్చుకోవచ్చునని కోర్టుకు తెలిపారు. దాంతో జడ్జిలను దారుణంగా తిట్టిన కేసును సీబీఐకి అప్పగించారు. అయితే సీబీఐ కూడా ఈ కేసుపై పురోగతి సాధించలేదు.
దేశంలోని చాలా రాష్ట్రాలలో జరుగుతున్న సంఘటనలు ఉదహరిస్తూ చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ సీబీఐ పైనా, ఇంటెలిజెన్సు వ్యవస్థ పైనా వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్ గఢ్ లో ఒక న్యాయమూర్తిని మాఫియా చంపేసిన సంఘటన పై కూడా చీఫ్ జస్టిస్ రమణ తీవ్రంగా స్పందించారు.
చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలతో సీబీఐ ఏమనుకుందో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ లో జడ్జిలను తిట్టిన వారి కేసులను ముందుకు తీసుకువచ్చింది. ఇప్పటికే ఐదుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పి. ఆదర్శ్, ఎల్ సాంబశివారెడ్డి, కొండారెడ్డి, సుధీర్ని అరెస్ట్ చేశారు.
కువైట్ నుంచి వచ్చిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి జులై 9న అరెస్ట్ చేశారు. అయితే ఎంపీ నందిగం సురేష్, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ పాత్రను పరిశీలిస్తున్నామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.