టెన్షన్… టెన్షన్… టెన్షన్… ఎన్నికల ఫలితాల కన్నా ఎక్కువ ఉత్కంఠ రేపుతున్న అంశం. మళ్లీ చర్చలోకి వచ్చింది జగన్ బెయిల్ వ్యవహారం. రేపు కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో తీవ్ర ఆందోళన ప్రారంభం అయింది.
జగన్ బెయిల్ కొనసాగుతుందా? లేదా రద్దు అవుతుందా? అనే అంశంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఒక వేళ బెయిల్ రద్దయి, జగన్ జైలుకు వెళితే తమ భవిష్యత్తు ఏమిటనే ఆందోళనలో వైసీపీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడ ఏ సమూహంలో చూసినా వైసీపీ నాయకుల మధ్య జగన్ బెయిల్ వ్యవహారంపైనే చర్చ జరుగుతున్నది.
దీనికితోడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని తిరుపతి మాజీ ఎంపి, సీనియర్ నాయకుడు చింతా మోహన్ చెప్పడంతో భయాందోళనలు మరింత పెరిగాయి. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు అంశంపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.
తుది నిర్ణయం రేపు అంటే బుధవారం రాబోతున్నది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు పలుమార్లు విచారణ చేపట్టింది. ఈ నెల 25న తీర్పు రావాల్సి ఉండగా తీర్పును ఈ నెల 15కు వాయిదా వేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. జగన్ బెయిల్ రద్దు అయితే పరిస్థితేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అందుకే ఈ టెన్షన్ నెలకొని ఉన్నది. సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఏం తీర్పు చెబుతారా అని కోట్లాది మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ దశలన్నీ దాటి తుది దశకు వచ్చినందున ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించే అవకాశం ఉందా?.
అందరూ ఊహిస్తున్నట్టు ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా?. విజయసాయిరెడ్డి బెయిల్పై కూడా కోర్టు తీర్పు వెలువడుతుందా?. బెయిల్ రద్దు విషయంలో జగన్ శిబిరం ధీమాగా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికి రేపు సమాధానం వచ్చే అవకాశం ఉంది.