ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి ని సీబీఐ బృందం నేడు విచారించింది. 71వ రోజు కూడా సీబీఐ విచారణ కొనసాగుతున్నది. కడప, పులివెందుల ప్రాంతాల్లో సీబీఐ బృందాలు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను విచారణకు పిలిచారు. వైఎస్ అవినాష్రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ ప్రతాపరెడ్డి లను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అటు కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో మరి కొందరు అనుమానితుల్ని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
కీలక నిందితుడు సునీల్ యాదవ్ను సీబీఐ అధికారులు పది రోజుల పాటు విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో అతన్ని కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకి తీసుకెళ్లారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సునీల్ యాదవ్ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పది రోజులపాటు పులివెందులలోని పలువురు అనుమానితుల ఇళ్లల్లో ఆయుధాలు, దుస్తులు, వస్తువులు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పదిరోజులపాటు విచారణలో కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.
సునీల్ యాదవ్ కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. సునీల్కు నార్కో పరీక్షలకు అనుమతి కోరుతూ.. సీబీఐ అధికారులు పిటిషన్ ధాఖలు చేశారు. అందుకు సునీల్యాదవ్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. రిమాండ్ గడువు రెండ్రోజులే ఉండటంతో కస్టడీకి కోర్టు నిరాకరించింది. విచారణ రేపటికి వాయిదా వేసింది. సునీల్ ఈనెల 18 వరకు రిమాండ్ ఖైదీగా కడప జైలులో ఉండనున్నారు.