పెంచిన రసాయనిక ఎరువుల ధరలు తగ్గించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు.
శుక్రవారం కడప లోని స్థానిక ఆర్ డి ఓ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల రసాయనిక ఎరువుల ధరలను ఎన్నడూ లేని విధంగా 58 శాతం పెంచి రైతుల పై పెనుభారం మోపింది అన్నారు. ఇప్పటికే సాగు ఖర్చులు భరించలేక రైతుల వ్యవసాయ రంగానికి దూరం అవుతున్నారు అన్నారు.
పాలక ప్రభుత్వాలు సేంద్రియ వ్యవసాయం పై ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆచరణలో అమలుకు నోచుకోలేదు అన్నారు. పశుసంపదను కాపాడుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి అన్నారు. పెంచిన ధరలు అమలులోకి వస్తే ఎకరాకు ఏడు వేల నుండి 15 వేల వరకు రైతులకు అదనపు భారం పడుతుందన్నారు.
డి ఏ పి 1200 నుండి1900కు,28-28-0 1350 నుండి1700 కు, 14-35-14 1350 నుండి1700 కు, 19-19-19 1350 నుండి 1700కు, 10-26-26 1290 నుండి1575 కు, 12-32-16 1360 నుండి 1700కు, 20-20-0-13 950 నుండి1400 కు , పొటాష్ 875 నుండి 1000 కు పెంచిందన్నారు.
ప్రతి ఏటా పంట సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగు మందుల ధరలు అమాంతం పెరిగి పోతున్నాయని, అతివృష్టి అనావృష్టి తట్టుకొని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక అవమానభారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కాపాడతానని, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తానని ఎన్నికల ముందు నమ్మబలికి అందలం ఎక్కగానే రైతాంగ వ్యతిరేక సాగుచట్టాలను తెచ్చి పూర్తిగా కార్పొరేట్ కంపెనీల కు కట్టబెట్టాలని చూడటమే కాకుండా, ఎరువుల ధరలను ఏకంగా 58 శాతం పెంచడం దారుణమన్నారు.
ఎరువుల ధరలు తగ్గించే వరకు పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. అనంతరం ఏవో కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు టి మనోహర్ రెడ్డి, బాలచంద్ర నాయుడు, రామాంజనేయులు రెడ్డి, మేకల జయన్న, చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, నార్ల ప్రకాశం, వడ్ల మధు, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.