వరదలు, తుపాన్లు, పెరుగుతున్న కరోనా…. ఇవేవీ రాజకీయాలకు అడ్డుకాదు అని నిరూపించింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అనూహ్యంగా కేంద్రానికి రప్పించుకుని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతీకారం తీర్చుకున్నది.
వరదలు, తుపాన్ భీభత్సం పై సమీక్ష, పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పన్ బందోపాధ్యాయ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వచ్చినపుడు కలవడంలో జాప్యం జరిగింది.
దాదాపు 15 నిమిషాల పాటు ప్రధాని వీరిద్దరి కోసం వేచి చూడాల్సి వచ్చింది. 15 నిమిషాల పాటు ప్రధాని వేచి ఉన్న తర్వాత వీరిద్దరూ అక్కడకు వెళ్లి ప్రధానికి వరద సాయంపై నివేదిక అందచేశారు.
దీనిపై ప్రధాని మోడీ ఢిల్లీ తిరిగి వెళ్లగానే చర్యలు తీసుకున్నారు. ఐఏఎస్ అధికారుల సర్వీస్ మేటర్లను పర్యవేక్షించే డివోపీటీ తక్షణమే బందోపాథ్యాయ ను ఢిల్లీ వచ్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
మే 31వ తేదీ ఉదయం 10.30కి తమకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదే అయినా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా చేయరు.
అయితే అసాధారణ రీతిలో అదీ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారిని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
బందోపాధ్యాయ ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయాల్సి ఉండగా కరోనా పరిస్థితుల కారణంగా మూడు నెలల పాటు ఆయన సర్వీసును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఇప్పుడు దాన్ని కూడా కేంద్రం రద్దు చేసే అవకాశం కనిపిస్తున్నది.