జగన్ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం అసాధారణ ప్రేమ కురిపించింది. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కోసం ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ నిధుల ను మంజూరు చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ప్రకటించారు. రెవెన్యూ లోటు భర్తీ చేయాలంటూ 2014 నుంచి ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్నది. ఇన్నాళ్లుగా కొర్రీలు వేస్తూ వచ్చిన కేంద్రం అకస్మాత్తుగా నిధుల విడుదల చేసింది.
2018లో ఈ విషయమై కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపారు. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూలోటును రూ. 16,078 కోట్లుగా పరిగణించాలన్నారు. 2014-15 నాటికి బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. కానీ, అప్పట్లో కేంద్రం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రం ప్రభుత్వం పలు దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినా స్పందన కరువైంది.
అయితే, ఈ ఏడాది మార్చిలో కేంద్రం రెవెన్యూ లోటుకు సంబంధించి రాష్ట్రం నుంచి వివరాలు కోరింది. 2014-15, అంతుకుముందు కాలానికి సంబంధించి ఏయే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి? వాటిల్లో చెల్లించాల్సిన బిల్లులు ఏవి? తదితర వివరాలతో ఆధారాలతో సహా పంపాలని కోరింది. ఆ తరువాత ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద సుమారు రూ.10,461 కోట్లను విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.