27.7 C
Hyderabad
April 25, 2024 07: 56 AM
Slider ముఖ్యంశాలు

యువ‌తను ప‌ట్టించుకోని కేంద్రం

central government ignores youth

దేశానికి కీల‌క మాన‌వ వ‌న‌రుగా,  ప్ర‌త్యేక శ‌క్తిగా ఉండే యువ‌త ఉద్యోగ స‌మ‌స్య‌ను కేంద్ర ప్రభుత్వం ప‌ట్టించుకోవటం లేదని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత నామ నాగేశ్వ‌రరావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్యోగాలు రాక‌పోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఈ అంశంపై చ‌ర్చించాల‌ని తాము స‌భ‌లో స్పీక‌ర్ కు  వాయిదా తీర్మానం ఇస్తే క‌నీసం చ‌ర్చ‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డం దారుణం అని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ స‌మ‌స్య‌పై చ‌ర్చించ‌ని నేప‌థ్యంలో తాము లోక్‌స‌భ నుంచి  వాకౌట్ చేసిన‌ట్టు ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు చెప్పారు. భారతదేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని పేర్కొన్నారు.

2014లో 5.6% నిరుద్యోగం ఉంటే ప్రస్తుతం 8.1%కు పెరిగిందని గుర్తు చేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(ఇండిపెండెంట్ ఏజెన్సీ) దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగల గురించి ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే గత ఎనిమిది సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ ప‌త‌న‌మైంద‌ని వివ‌రించారు. దీంతో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వ‌ర్గాల‌కు చెందిన వారు ఇబ్బందులుపడుతున్నారని వెల్ల‌డించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల పరిధిలో దాదాపు 16 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా వున్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు తాత్సారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విషయంలో ఉభయ సభల్లో ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నారన్నారు. కానీ కేంద్రంలో ఖాళీగా ఉన్నా ఉద్యోగాల భర్తీకి కేంద్రానికి చిత్తశుద్ధి లేద‌న్నారు. గడిచిన 8 ఏళ్లలో 23 పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ విభాగాలు మూసివేశార‌న్నారు. దేశంలో నిరుద్యోగ శాతం పెరగడంతో ఆత్మహత్యలు అధికం అవుతున్నాయ‌ని వివ‌రించారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికీ కేంద్రం స్పందించకపోవడం శోచనీయమన్నారు. దేశవ్యాప్తంగా మూడు సంవత్సరాల్లో 25 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు.

బీజేపీ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో దేశంలో నిరుద్యోగ యువతకి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని హామీ ఇచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అంటే 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండేద‌న్నారు. యువతను మోసం చేసేందుకు, యువత ఓట్ల కోసమే నాడు 2 కోట్ల ఉద్యోగాలు అని ప్రకటన చేశార‌ని ఎంపీ నామ నాగేశ్వ‌ర రావు తెలిపారు. తప్పడు వాగ్దానాలతో కేంద్రం యువతను మోసం చేస్త ఇబ్బంది పెడుతుంద‌ని మండిప‌డ్డారు. ఈ విషయమై యువత ఆలోచించుకోవాలని సూచించారు. యువ‌త‌ప‌క్షాన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో పోరాటం చేస్తుందన్నారని వెల్ల‌డించారు.

Related posts

చరిత్ర పునరావృతం చేయబోతున్న మహిళా బాక్సర్లు

Satyam NEWS

పెన్షన్లు తక్షణమే పంపిణీ చేయండి

Satyam NEWS

దళితులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాం

Satyam NEWS

Leave a Comment