స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ అవార్డ్ తెలంగాణకు మూడో సారి వచ్చిందని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ అవార్డు రావడం మరింత సంతోషకరమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు ఛాలెంజింగ్ గా తీసుకొని స్వచ్చ కార్యక్రమలు చేపట్టారని, పెద్దపెల్లి జిల్లా దేశంలోనే మొదటి స్థానం రావడం గర్వకారణమని ఆయన అన్నారు. 30 రోజుల ప్రణాళిక, పల్లె ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీలకు నిధులు లేవు.. ఇప్పుడు 339 కోట్లు ప్రతినెల విడుదల చేస్తున్నాం..గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం..అని మంత్రి దయాకరరావు తెలిపారు. కేంద్రం నుంచి అనుకున్నంత నిధులు రావడం లేదని, అందుకోసమే నిధుల విడుదల కోసం కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి అన్నారు. PMGSY లో భాగంగా మన రాష్ట్రానికి ఫేజ్ 2 లో భాగంగా 2400 కిలో మీటర్ల రోడ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఫేజ్-2 లో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినపుడు కొన్ని లెక్కల వల్ల మనకు రావలసిన 1700 కిలో మీటర్లు తప్పుగా లెక్కించడం వల్ల రాలేదు. ఇపుడు అదికూడా కలిపి కనీసం 4000 కిలో మీటర్లు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది అని మంత్రి తెలిపారు. జేఎస్ కింద 1200 కోట్ల నిధులు రావాల్సి ఉంటే కేవలం 320 కోట్లు మాత్రమే విడుదల చేసారు. మిగిలిన 600 కోట్ల నిధులను విడుదల చేయాలి.. మరుగుదొడ్లు, డంపింగ్ యర్డ్స్, స్మశానవాటిక, గ్రామపంచాయతీ భవనాలు కట్టాం. ఆ బిల్లులు విడుదల చేయలేదు.. అన్ని రంగాల్లో అవార్డులు ఇచ్చారు సంతోషం, కానీ నిధులు కూడా ఇస్తే బాగుంటుందని మంత్రి అన్నారు.
next post