ఆకలితో చనిపోతున్న ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. దేశవ్యాప్తంగా మోడల్ కమ్యూనిటీ కిచెన్ పథకానికి తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది.
ఇదిలావుంటే, సామాజిక వంటశాలల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
వీటిపై ఉమ్మడి పథకం రూపొందించడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని.. వీలైనంత త్వరలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజలు ఆకలితో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో వారికి ఆహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించి మూడువారాల్లో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని.. లేదంటే తామే ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించే పనిలో పడింది.