తప్పు ఒప్పులు తెలుసుకోకుండా ఎదుటి వారిపై నిందలు వేయడం వైసీపీ కి ఆనవాయితీగా మారిపోయిందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు ను అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడు అదే బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.
ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమేనని, కృష్ణాజిల్లాలో వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య జరిగితే ఆ కేసు ఎటువంటి ఆధారాలు లేకుండా కొల్లు రవీంద్ర పై వేసి ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని చదలవాడ అన్నారు. కృష్ణాజిల్లాలో కొల్లు రవీంద్ర ఒక బలమైన బీసీ నేతగా ఉన్నారు. ఆయన పై అక్రమంగా కేసుల్లో ఇరికించి రాజకీయ లబ్ది పొందాలని అక్కడ వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.
ఏడాది పాలనలో 225 మంది బీసీలపై జరిగితే ఏనాడు స్పందించిన వైసీపీ నేతలు నేడు మాత్రం రోడ్డెక్కి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఏనాడు బీసీలను పట్టించుకోలేదు.
తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న దళితులు,బీసీలు, మైనార్టీలను అణచివేతకు గురి చేసి రాజకీయ కక్ష సాధించాలని జగన్ కుట్రకు తెరలేపారు అని అన్నారు.