జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలోనే ఏపీ ని కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారని గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అరవింద బాబు మాట్లాడుతూ ఇప్పటికే వైన్, మైన్,శాండ్, ఇళ్ల పట్టాలు, కరోనా కిట్లతో పాటు ఆఖరికి బ్లీచింగ్ పౌడర్ లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆయన తెలిపారు.
మొన్న సరస్వతి పవర్ కోసం ఏ-1 దోచుకూంటే, నేడు అరబిందో ను అడ్డం పెట్టుకొని ఏ-2 దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కాపాడుతూ సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ ల కొనుగోళ్లు, నిర్వహణలో రూ.307 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
డిసెంబర్ 2020 వరకు ఒప్పందం అమలులో ఉన్న కూడా జీ.వో నెం.116 ను తీసుకువచ్చి అరబిందో సంస్థకు అధిక ధరలు చెల్లించి కాంట్రాక్ట్ ను కట్టబెట్టి రూ. 307 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆయన తెలిపారు. ఏడాది కాలంలో నింగి నుంచి నేల వరకు దోచుకుంటున్న వైసీపీ నాయకుల భాగోతాలు బయట పెడుతున్న ప్రతిపక్ష పార్టీ నేతల పై జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. అక్రమ కేసులు, అరెస్టులు,దాడులు,బెదిరింపులతో టిడిపి నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.