తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు నేడు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. కరోనా నేపథ్యంలో ఆయన తన పుట్టిన రోజును హైదరాబాద్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు.
కేక్ కట్ చేసిన చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరికి ముందుగా కేక్ తినిపించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లి లో ఆయన 1950, ఏప్రిల్ 20న జన్మించారు. 1972లో బీఏ పూర్తి చేసి ఎస్వీ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
1978లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటి సారి ఎమ్మెల్యే అయిన వెంటనే సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 28 ఏళ్లకే మంత్రి పదవి చేపట్టిన అరుదైన ఘనతను చంద్రబాబునాయుడు సాధించారు.
1981 సెప్టెంబర్ 10న భువనేశ్వరితో వివాహం జరిగింది. అనంతరం 1983లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఓటమి చవిచూశారు.1989 ఎన్నికల్లో కుప్పం నుంచి 5 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1995 సెప్టెంబర్ 1 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు 1999 అక్టోబర్ 11న ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు.
2004 వరకు ఎన్డీయే కి జాతీయ కన్వీనర్ గా చంద్రబాబు బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలలో టీడీపీ అనూహ్యంగా ఓటమి చవి చూసింది. అప్పటి నుంచి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.