అమర్ రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు వెనక్కి తీసుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి ఎంపి గల్లా జయదేవ్ పై అక్కసుతోనే అమర్ రాజా భూములు వెనక్కి తీసుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పన్నులు చెల్లించే పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్ర నాయుడు. పారిశ్రామికంగా ఏపిని ప్రపంచపటంలో పెట్టాలనే లక్ష్యంతో విదేశాల నుంచి వచ్చి అమర్ రాజా యూనిట్లను స్థాపించారు. వారి కంపెనీలలో 16వేల మందికి ఉపాధి కల్పించారు.
20వేల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అటువంటి పారిశ్రామిక వేత్తలకు కూడా వైసిపి మోకాలడ్డటం గర్హనీయం అని చంద్రబాబునాయుడు అన్నారు. వెనుకబడిన ప్రాంతం పశ్చిమ చిత్తూరు అభివృద్దికి, యువత ఉపాధి కల్పనకు అమర్ రాజా పరిశ్రమలు ఎంతో తోడ్పడ్డాయి. బంగారు పాళ్యెం భూముల్లో ఇప్పటికే యూనిట్ ను నెలకొల్పారు. 5వేల మందికి ఉపాధి కల్పించారు.
సగం భూములు అభివృద్ది చేసి మరోసగం అభివృద్దికి రంగం సిద్దం చేశారు. ఈ తరుణంలో 250ఎకరాల భూమి కేటాయింపు రద్దు చేయడం కేవలం కక్ష సాధింపుతోనేనని చంద్రబాబు అన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారని చంద్రబాబునాయుడు అన్నారు.
ఇప్పటికే వైసిపి ప్రభుత్వ దుశ్చర్యలతో ఆంధ్రప్రదేశ్ గత ఏడాదిగా దేశవిదేశాల్లో అప్రదిష్ట పాలైంది. జర్మనీ,ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, కొరియా తదితర దేశాల ఎంబసీలు హెచ్చరికలు పంపాయి. దావోస్ లో కూడా వీటన్నింటిపై చర్చ జరిగింది. టిడిపి హయాంలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఉన్న రాష్ట్రం గత ఏడాదిగా పెట్టుబడుల తిరోగమనం(రివర్స్) నెలకొనడం బాధాకరం.
గవర్నమెంట్ టెర్రరిజం ఉందని, బీహార్ ఆఫ్ సౌత్ గా ఏపి మారిందని పారిశ్రామిక వేత్తల వ్యాఖ్యలకు ఈవిధమైన చర్యలు మరింత ఊతం ఇచ్చేలా ఉన్నాయి. ఇకనైనా ఇటువంటి వేధింపులకు, కక్ష సాధింపునకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్వస్తి చెప్పాలని చంద్రబాబు నాయుడు అన్నారు.