పోలీసుల చట్ట ఉల్లంఘనలు వారినీ బోనులో నుంచో పెడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. అక్రమ అరెస్టులపై పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం పోలీసులు చేసే చట్ట ఉల్లంఘనలు పోలీసుల్నే బోనులో నుంచో పెడతాయని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేస్తే పోలీసులు మూల్యం చెల్లించుకోకతప్పదని చంద్రబాబు అన్నారు.
విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ అక్రమమని కోర్టు ఆయన రిమాండ్ తిరస్కరించడం పై డిజిపి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంకబాబుకు 41 -A Cr.P.C నోటీసు ఇచ్చే విషయంలో పోలీసులు చట్టాన్ని ఫాలో అవ్వలేదని మెజిస్ట్రేట్ కోర్ట్ చెప్పింది. అంతే కాకుండా దీనిపై నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని కేసు పెట్టిన సిఐడి పోలీసులకు షో కాజ్ నోటీసులు ఇచ్చింది.
అంకబాబుకు నోటీసులు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చారు? మీరు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారన్న దానికి సాక్ష్యం ఏంటి అని కూడా కోర్టు ప్రశ్నించింది. అక్రమ అరెస్టు లకు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి ఏపీ పోలీస్ శాఖను తీసుకువచ్చింది ఎవరు? తమ తప్పుడు వైఖరికి సిఐడి సిగ్గు పడాలి. రాష్ట్రంలో చట్ట ఉల్లంఘనలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ ఘటన ద్వారా మరో సారి నిరూపితం అయ్యింది అని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలను, రాజకీయ పక్షాలను భయపెట్టేందుకు అధికారం పూర్తిగా దుర్వినియోగం అవుతుంది. రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తుంది అనడానికి ఇంతకంటే ఏం రుజువులు కావాలి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ దీనికి సమాధానం చెప్పాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.