పింక్ డైమండ్ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తొలి సారిగా స్పందించారు. పింక్ డైమండ్ పోయిందని అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజలకు అనుమానం వచ్చే రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు వెంకటరమణ దీక్షితులు పింక్ డైమండ్ గురించి చెప్పారు. వెంకట రమణ దీక్షితులు చెప్పిన వెంటనే దాన్ని వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి బహుళ ప్రచారంలో పెట్టారు.
దాంతో పింక్ డైమండ్ వ్యవహారంపై లోలోన ఏదో జరిగిందని చాలా మంది అనుమానపడ్డారు. అయితే వాస్తవానికి అలాంటి పింక్ డైమండ్ అనేది లేదని, ఊరేగింపు సమయంలో స్వామివారికి అలంకరించే రూబీ ఒకటి ప్రమాదవశాత్తూ పగిలిపోయిందని, ముక్కలు కూడా దేవస్థానం వద్దే ఉన్నాయని అప్పటిలో అధికారులు వివరణ ఇచ్చినా ఏదో జరిగిపోయిందనే చాలా మంది నమ్మారు.
పింక్ డైమండ్ పై తొలి సారిగా బయటకు వచ్చి చెప్పిన వెంకట రమణ దీక్షితులను ఇప్పుడు మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించారు. పింక్ డైమండ్ పోయిందంటు ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదు అని నేడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తిరుమల వచ్చిన ఆయన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం ప్రసాదించాలని తాను తిరుమల శ్రీవారిని కోరినట్లు చంద్రబాబునాయుడు చెప్పారు.
శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరి పై వుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఉన్న పెద్ద ఆస్తి శ్రీవారు అంటూ వ్యాఖ్యానించారు. వెంకటరమణ దీక్షితులు మనిషిని దేవుడితో పోల్చడం మంచి పద్దతి కాదని చంద్రబాబునాయుడు అన్నారు. ఇలాంటి అపచారాలు గతంలో వెంకటరమణ దీక్షితులు చేశారని చంద్రబాబునాయుడు అన్నారు.