రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. రాజధానికి భూములిచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.
శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవాళ్లపై పోలీసు జులుం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు. రైతులపైకి పోలీసు వాహనాలను నడిపి గాయాలపాలు చేశారని ఆయన అన్నారు. వేలాది పోలీసులను గ్రామాల్లో దించి భయభ్రాంతులను చేస్తారా ? భూములిచ్చిన వాళ్ళను ఇంత దారుణంగా హింసిస్తారా ..? అని ఆయన ప్రశ్నించారు.
పోలీసులు రాజధాని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఆయన కోరారు. రైతులు, మహిళల్లో నెలకొన్న ఆందోళనలు తొలగించే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.