వైకాపా నేతలు కాళ్లరిగేలా ఇల్లిల్లూ తిరిగినా వచ్చే ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అఖండ మెరారిటీ సాధించి ముఖ్య మంత్రి అవుతారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు జగన్ పాలనను ఈసడించుకుంటున్నారని తెలిపారు.
గురువారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనవరి నుంచి రోడ్ల మీద తిరగాలని మంత్రులను ఆదేశించారని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు వైకాపాకు దూరమవుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న జగన్ భయపడి కొత్త ఎత్తులు వేస్తున్నారని చెప్పారు. గతంలో ఓదార్పు యాత్రలు చేసి, చంద్రబాబు నాయుడుపై అసత్యాలు, అబద్ధాలు చెప్పి ప్రజను ఆకట్టుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరవాత తన పాలేగాళ్ల ద్వారా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఎర్రచందనం, ఇసుక, భుకాబ్జాలు, దొంగ సారా సంపాదన చాలక టీటీడిపై పడ్డారని ఎద్దేవా చేశారు. దేవుని దర్శనం టిక్కెట్లు అమ్ముకోవడానికే 81 మందితో టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేశారని విమర్శించారు. నవరత్నాలు జారిపోయి, నవ రంధ్రాలు మూసుకుపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రజలు జగన్ పై నమ్మకం కోల్పోయారని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు సామర్ధ్యం తెలిసిన ప్రజలు అయన కు బాసటగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడుగడుగునా జగన్ అరాచక పాలనపై పోరాడి ప్రజల మనసు గెలుచుకుంటున్నారని చెప్పారు. కాగా చిత్తూరు జిల్లాలో వున్న 14 అసెంబ్లీ స్థానాలలో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ సారి పెద్ది రెడ్డి, చెవిరెడ్డి, రోజా రెడ్డి లాంటి వారికి కుడా ఓటమి తప్పదన్నారు.