ఎట్టకేలకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షనాయకుడు ఎన్. చంద్రబాబునాయుడు వైజాగ్ పర్యటనకు అంగీకరించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబునాయుడు విశాఖ పట్నం పర్యటనకు వెళ్లేందుకు, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అమరావతి వెళ్లేలా పోలీసులను అనుమతి అడిగారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు చంద్రబాబునాయుడికి తెలంగాణ ప్రభుత్వం అడిగిన వెంటనే అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎటూ తేల్చకుండా నానబెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి రాదనే అందరూ అనుకున్నారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ వస్తే క్వారంటైన్ కు పంపిస్తామని మంత్రులే ప్రకటించారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ రావడం అనవసరమని భావించిన చంద్రబాబునాయుడు హైదరాబాద్ లోనే ఉండిపోయారు. విశాఖ పట్నంలో విష వాయువు లీక్ అయి 12 మంది మరణించిన నేపథ్యంలో విశాఖ పట్నం వెళ్లేందుకు చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు.
ఆనందం వ్యక్తం చేస్తున్న టీడీపి శ్రేణులు
అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు అనుమతి రాలేదు. దాంతో ఆయన విశాఖ పట్నం వెళ్లలేకపోయారు. ఎట్టకేలకు విశాఖ పర్యటనకు చంద్రబాబు కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఏపి డీజీపీ నుంచి అనుమతి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అయింది. సోమవారం ఉదయం 10గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖకు చంద్రబాబు వెళతారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రాంతాల్లో పర్యటించి వెంకటాపురంలోని బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. అనంతరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో చంద్రబాబు భేటీ అవుతారు.