రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలి ప్రభుత్వం చెప్పినట్లు చేయడం కాదు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని ప్రాంత రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా? దొంగలు, గుండాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడులా? రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
నేడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి రైతులను అరెస్ట్ చేస్తారా? మహిళలు, వృద్దులను భయబ్రాంతులకు గురిచేస్తారా? ఇదేం న్యాయమని ఆయన ప్రశ్నించారు. వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం ,వెలగపూడికి చెందిన 6గురు రైతుల అరెస్ట్ అప్రజాస్వామికమని, వేలాది మంది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణచివేయలేరని ఆయన అన్నారు.