విశాఖపట్నంలో భూమి కోల్పోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయనను హైదరాబాద్ పంపారు. విశాఖ పట్నం లోని ఎయిర్పోర్టు లాంజ్ నుంచి నేరుగా ఆయనను పోలీసులు రన్వేపైకి కారులో తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా చంద్రబాబు తరలింపును చిత్రీకరిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అంతకముందు ఏం జరిగిందంటే.. తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధింలోనే ఉంచారు.
ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం నుంచి ఎయిర్పోర్టు వద్ద హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈ ఉదయం చంద్రబాబు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా తరలివచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు, నేతల నినాదాలతో వాతావరణ ఒక్కసారిగా హీటెక్కింది. చంద్రబాబు కాన్వాయ్పై కోడిగుడ్లు, టమోటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు చంద్రబాబు వాహనంలోనే ఉండి పోయారు. నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును అదుపులోకి తీసుకుని హైదరాబాద్ పంపారు.