తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం టిడిపి సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆన్ లైన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు: ఈ జులై, ఆగస్ట్ నెలలు చాలా కీలక సమయం. కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవన విధానం కూడా అందుకు అనుగుణంగా మార్చుకోవాలి.
వర్ట్యువల్ వర్కింగ్, ఫిజికల్ డిస్టెన్స్, డిజిటల్ సోషలైజేషన్ పాటించాలి. బైటకు వెళ్లేవారు తప్పకుండా పిపిఈలు ధరించాలి. అందరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాను కూడా వైసిపి స్కామ్ లకు వాడుకోవడం గర్హనీయం. ఇంటింటికి 3మాస్క్ లు అందిస్తామని చెప్పి ఎక్కడా పంపిణీ చేయలేదు. మాస్క్ ల తయారీలో కూడా అవినీతికి పాల్పడ్డారు. కరోనా కిట్ల కొనుగోళ్లలో, బ్లీచింగ్ కొనుగోళ్లలో కుంభకోణాలు చేశారు.
అంబులెన్సులలో నూ అవినీతికి పాల్పడ్డారు
చివరికి అంబులెన్స్ లలోనూ రూ408కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అంబులెన్స్ ల కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ విజయసాయి రెడ్డి అల్లుడి కంపెనీ అవునా కాదా..? దానికి అంబులెన్స్ కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని అడిగితే వేధింపులా..? సరస్వతి పవర్ మీ స్వంత కంపెనీ అవునా కాదా..?
దానికి నీళ్లు, గనులు ఎలా కేటాయిస్తారని అడిగితే సెక్రటరీతో నోటీసులిస్తారా..? అవినీతికి పాల్పడిన వాళ్లను వదిలేసి, అది బైటపెట్టిన వాళ్లకు నోటీసులు ఇస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు. ఇళ్ల స్థలాల్లో రూ30వేల నుంచి రూ70 వేల మామూళ్ల వసూలుపై వైసిపి నాయకులు, అధికారులు ఎందుకని మాట్లాడరు..?
భూముల కొనుగోళ్లలో వందల కోట్ల కుంభకోణాలపై ఎందుకని స్పందించరు..? వసూలు చేసిన డబ్బు తిరిగి ఇచ్చేస్తామని ప్రజలకు ఎందుకని భరోసా ఇవ్వడం లేదు..? బాధితులకు అండగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదా..? వసూళ్లకు పాల్పడిన వాళ్లకే వత్తాసు పలకడం ఆంతర్యం ఏమిటి..?
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, కేసులు పెట్టి వేధిస్తున్నారని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొనడమే ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అకృత్యాలకు నిదర్శనం.
అధికార పార్టీ వైసిపి ఎంపికే రాష్ట్రంలో భద్రత లేదు. ‘‘తన ప్రాణాలకు ముప్పు ఉందని, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని’’ వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజు లేఖ రాయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనం. ‘‘తన ప్రాణాలకు హాని ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కేంద్ర భద్రత కావాలని’’ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గతంలోనే లేఖ రాశారు.
ప్రతిపక్షాల ప్రజాప్రతినిధులు ఇదే అంశంపై గతంలో లేఖలు పంపారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణాలకు ముప్పు ఉందని వీళ్లంతా తమ ఫిర్యాదులలో పేర్కొన్నారు. అంటే రాష్ట్రంలో వైసిపి ఎంత భయోత్పాతం సృష్టిస్తుందో అర్ధం అవుతోంది. కరోనా సమయంలో కూడా వైసిపి కక్ష సాధింపులు ఆపకపోవడం దుర్మార్గం.
అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసా?
బిసి నాయకుడి ఫొటో ఎందుకు తొలగించారని అడిగిన అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు, పెళ్లికి వెళ్లారని యనమల రామకృష్ణుడు, చినరాజప్పలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టారు. ఆపరేషన్ చేయించుకున్న స్థితిలో అచ్చెన్నాయుడిపై అక్రమ కేసు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారు.
అంబులెన్స్ ల ముసుగులో కుంభకోణాలను బైటపెట్టారని పట్టాభిని వేధించారు, బొండా ఉమా మహేశ్వర రావు ఇంటి వద్ద పోలీసు నిఘా పెట్టడం, సీఎం కంపెనీకి గనులు, నీళ్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించామని, నాకు, మరో 2 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపడం వైసిపి ఉన్మాద చర్యలకు రుజువులు. నిన్న కూడా నందిగామలో కృష్ణ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. విశాఖలో 70ఏళ్ల కిషోర్ ను అరెస్ట్ చేశారు.
వృద్ధులను కూడా కేసులతో వేధిస్తారా?
గుంటూరులో 66ఏళ్ల రంగనాయకమ్మపై తప్పుడు కేసు పెట్టి వేధించారు. చివరికి వృద్దులను కూడా వైసిపి వదలడం లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారని ముగ్గురు దళిత యువకులను అరెస్ట్ చేయడం వైసిపి మరో దుర్మార్గం. చిలకలూరిపేటలో పిల్లి కోటేశ్వర రావుపై, కర్నూలులో తిలక్ పై, సుళ్లూరు పేటలో నిమ్మల లోకేష్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.
పరిపాలన చేతగాక ప్రతిపక్షాలపై ప్రతీకారమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. ప్రశ్నించే గొంతు నొక్కడం, ప్రజాదరణ గల ప్రతిపక్ష నాయకులపై తప్పుడు ఆరోపణలతో అప్రదిష్ట పాలు చేయడం, అక్రమ కేసులు పెట్టి వేధించడం వైసిపి ప్రతీకార ధోరణికి ప్రత్యక్ష సాక్ష్యం.
ఇంత అధికార దుర్వినియోగం ఎన్నడూ చూడలేదు
ఇంత అధికార దుర్వినియోగం 64ఏళ్ల రాష్ట్ర చరిత్రలో లేదు. ఇన్ని తప్పుడు కేసులు దేశంలో ఎక్కడా లేదు. ఇంతమంది అరెస్ట్ లు, జైళ్లకు పంపడాలు ఎప్పుడూ జరగలేదు. టిడిపి నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులను ఖండిస్తున్నాం. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులను గర్హిస్తున్నాం.
ఇప్పటికైనా మీ దుష్ట ప్రవర్తన మార్చుకోండి. దాడులు, దౌర్జన్యాలను నిలిపేయండి. ప్రజలు మీ అరాచకాలను సహించరు. మీ దాడులు, దౌర్జన్యాలను భరించరు. ఇష్టారాజ్యంగా చేస్తే ప్రజలే తిరగబడతారు అని ఆయన అన్నారు.