న్యాయమూర్తులపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నేడు చార్జిషీట్ దాఖలు చేసింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ ఉన్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పై గుంటూరు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది.
అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణలో భాగంగా జులై 9న రాఖశేఖర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. కేసులో భాగంగా కడప జిల్లాలో సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది.
వివిధ వ్యాజ్యాల్లో న్యాయస్థానం తీర్పుల వెల్లడి అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా, న్యాయమూర్తులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ హైకోర్టు అప్పటి ఇన్ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం 2020 అక్టోబర్ 12 న దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.