శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠ 70వ పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చాతుర్మాస్యదీక్ష కాకినాడ నగర శివారు తిమ్మాపురం గ్రామపరిధిలో గల శ్రీమతి ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ఈనెల 13నుండి 60రోజుల పాటు జరుగుతుందని ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వెల్లడించారు.
మంగళవారం అయ్యప్ప గుడి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన కార్యక్రమ నిర్వహణ ఉద్దేశం వివరించారు. ముఖ్యంగా లోక కల్యాణానికి విశ్వశాంతికి ఇటువంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు.
ఈ నెల 9 వ తేదీన స్వామివారి ఆగమనం ఉంటుందని అచ్చంపేట జంక్షన్, ఏ.డి.బి రోడ్ నందుగల నన్నయ్య వర్సిటీ పి జి సెంటర్ వద్ద నుండి స్వామివారికి భారీ ఎత్తున సువాసినులు, కన్యలు, భజన, వివిధ కళాజాతరలు భక్తజనులతో ఘనస్వాగతంతో ఊరేగింపుగా గోశాలకు విచ్చేస్తారన్నారు.
13 వ తేదీ నుండి 60 రోజులు స్వామి చాతుర్మాస్యదీక్ష లో ఉంటారని,ఈ చాతుర్మాస్య కాలమునందు ప్రతిరోజూ త్రిపురసుందరి (కామకోటి) సహిత చంద్రమౌళీశ్వరారాధన జరుగునని అన్నారు. ఈ సమయమునందు అపూర్వమైన, అద్వైతసభ, అగ్నిహోత్రులు సదస్సు, జ్యోతిషసదస్సు మొదలగు సమ్మేళనములు జరుగుతాయన్నారు.
ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు దీపపూజ, తదనంతరం సంగీత, వాద్య, నృత్య, భజనాది అనేక సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహిస్తారని తెలిపారు.వాతావరణ మార్పులు జనజీవనానికి అనుకూలంగా ఉండవని ప్రజలంతా ఒక్కచోట చేరి భగవరారాధన చేయడమే చాతుర్మాస్య దీక్ష ముఖ్యోద్దేశమని తెలిపారు.
భక్తులెల్లరూ ఈ కార్యక్రమములలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావాలని చాగంటి కోటీశ్వరరావు సూచించారు.ఇతర సమాచారం కొరకు డి. రామకృష్ణ రావు సెల్. నెం :9490886178., పి.విజయకుమార్ :961885555 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వక్కలంక రామకృష్ణ, ముళ్ళపూడి రాంబాబు, డి. రామకృష్ణ, పి.గోపాలకృష్ణ, డి. వి.బి.రాజు, నానాజీ తదితరులు పాల్గొన్నారు.