ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఒకాయన వచ్చి చెబితే పాపం ఆ అమాయకులు నమ్మారు. డబ్బులు కట్టారు. మొత్తం ఎంతో తెలుసా? రూ.1.62 కోట్లు ఇచ్చేశారు.
ఈ కథ అంతా వనపర్తి జిల్లా వీపనగండ్ల, పెబ్బేరు మండల పరిధిలో జరిగింది. చిన్నంబావి మండలంలోని అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మండ్ల వసంత, వీపనగండ్ల మండలం కల్వరాలకు చెందిన ఆర్ఎంపీ చిత్తమోని శాంతయ్య, వీపనగండ్లకు చెందిన డ్రైవర్ అశోక్ కుమార్ రెడ్డిలు ఇలా 36 మంది అమాయకులను దోచేశారు.
చిత్తమోని శాంతయ్య అనే వ్యక్తికి ఎస్సై ఉద్యోగం వచ్చిందని మీరు కూడా డబ్బు ఇస్తే జాబ్ గ్యారెంటీ అని నమ్మించారు. దాదాపు ఆరేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుండగా.. అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.
పెబ్బేరు ఎస్సై రాఘవేందర్రెడ్డి, వీపనగండ్ల ఎస్సై వహీద్అలీ బేగ్లు కేసు నమోదు చేసి విచారించగా వసంత, చిత్తమోనిశాంతయ్య, అశోక్ కుమార్ రెడ్డిలు అసలు సూత్రధారులని తేలింది. ఒక్కో ఉద్యోగానికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారు.
వసంత తాను రైల్వే శాఖలో టీసీ (టికెట్ కలెక్టర్)గా ఉద్యోగం చేస్తున్నానని.. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువకులను నమ్మించి డబ్బులు వసూలు చేసేది. ఈ క్రమంలో ఆర్ఎంపీ శాంతయ్యతో 2014 లో ఆమెకు పరిచయం ఏర్పడింది.
మొదట మోసపోయిన వాడే జత కట్టాడు
ఆయనతో చనువుగా ఉంటూ పోలీసుశాఖలో ఉన్నతాధికారులు తనకు బాగా తెలుసని ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.12 లక్షలు వసూలు చేసిందని పోలీసులు తెలిపారు. నకిలీ ఆర్డర్ కాపీని అందజేసి పోలీసు యూనిఫాం కూడా ఇచ్చింది.
అప్పటికే తన బంధువులైన కొందరికి మరికొన్ని ఉద్యోగాలు కావాలని వారి వద్ద డబ్బులు తెచ్చి ఇచ్చిన ఆయన ఆమె చెబుతున్న మాటలు నమ్మలేదు. తానుమోసపోయానని గుర్తించిన ఆయన ఆమెతో కలిసిపోయి మోసాలకుపాల్పడటం ప్రారంభించాడు.
వీరు తరచుగా అశోక్ కుమార్ రెడ్డి కారును తీసుకుని వెళ్లేవారు. వీరి మోసాల గురించి తెలిసిపోయిన అతను కూడా వీరితో మిలాఖత్ అయ్యాడు. వీరు స్థానిక మండలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడటం ప్రారంభించారు.
ఈ క్రమంలో రైల్వేశాఖలో టికెట్ కలెక్టర్, వివిధ రకాల ఉద్యోగాలు ఇప్పిస్తామని బత్తుల రాజేశ్ నుంచి రూ.6 లక్షలు, చటమోని అనిల్ దగ్గర రూ.4 లక్షలు, విద్దె శ్రీనివాసులు నుంచి రూ.2 లక్షలు, కొల్లాపుర్ పట్టణానికి చెందిన సుధాకర్ దగ్గర రూ.2.50 లక్షలు వసూలు చేశారు.
వీరందరికి నకిలీ ఆర్డర్ కాపీని అందించి రెండు నెలలపాటు నెలకు రూ.14 వేల జీతాన్ని కూడా ఇచ్చారు. జీతం సరే కాని ఉద్యోగాలు ఏమయ్యాయి అని నిలదీయగా ఆ మహిళ కనిపించకుండా పోయింది. దీంతో బాధితులు వీపనగండ్ల, పెబ్బేరు ఠాణాల్లో ఫిర్యాదు చేశారు.
కేసులు నమోదు చేసిన పోలీసులు కూపీలాగగా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితులపై కేసు నమోదు చేసి విచారించి నిందితుల నుండి 6లక్షలు నగదు, 6తులాల బంగారం,1లాబ్ ట్యాబ్, బెలెనో కారును, మొత్తం 20 లక్షల విలువగల వస్తులు స్వాధీనం చేసుకుని మంగళవారం రిమాండ్ కు తరలించామని డీఎస్పీ కెయం,కిరణ్ కుమార్ తెలిపారు.
ఈ కేసును ఎంతో చాకచక్యంతో వ్యవహరించి కేసును ఛేదించిన కొత్తకోట సిఐ, మల్లికార్జున్ రెడ్డి, పెబ్బేరు ఎస్సై, రాఘవేందర్ రెడ్డి, ఏఎస్సై, జయన్న హెడ్ కానిస్టేబుళ్లు,వెంకటస్వామి, చంద్రమోహన్,కానిస్టేబుళ్లు, భీమయ్య, స్వామి,బాలకృష్ణ, మహిళ కానిస్టేబుళ్లు,విజలక్ష్మి రేణుక, లక్ష్మీనర్సమ్మ ను డీఎస్పీ అభినందించారు.