31 కేసులు పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, లేఖ రాసిన సందర్భం చూస్తే పలు అనుమానాలు కలుగుతున్నాయని అటార్నీ జనరల్ కె కె వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.
అయితే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకే లేఖ రాసినందున, ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలనే పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలై ఉన్నందున తాను ఈ విషయంలో జోక్యం చేసుకోలేనని ఆయన తెలిపారు.
ప్రజా ప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది, ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి అశ్వినీ ఉపాధ్యాయ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అటార్నీ జనరల్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ లేఖకు అటార్నీ జనరల్ కె కె వేణు గోపాల్ స్పందిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి వద్ద విషయం ఉన్నందున తాను జోక్యం చేసుకోలేనని చెప్పారు. ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్ రమణ తీర్పు తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇలా లేఖ రాయడం అనేక అనుమానాలకు దారి తీస్తోందన్నారు. అన్ని విషయాలు సీజేఐకి తెలుసని, ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం తాను అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.