ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేది వరకు చేపట్టనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యం.మను చౌదరి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల 1,99,143 మంది పిల్లలకు నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఉచితముగా అల్బెన్దజోల్ మాత్రల పంపిణీ ఉంటుందన్నారు.
ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు పర్యాయాలు నిర్వహించే కార్యక్రమాన్ని కోవిడ్ కారణంగా నిర్వహించలేదని, ఈ సారి కరోనా కారణంగా పాఠశాలలు, అంగన్వాడీలు, కళాశాలలు మూతపడటంతో విద్యార్థులంతా ఇంటి వద్దనే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నందున నేరుగా వైద్య ఆరోగ్య సిబ్బంది వారి ఇంటింటికే వెళ్లి మాత్రల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.
ఒకటి నుండి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్ర 3 నుంచి 19 ఏళ్ళ లోపు పిల్లలకు అల్బెండజోల్ ఒక మాత్ర చొప్పున తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అందుకు ప్రత్యేక రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
జిల్లా వ్యాప్తంగా 1,91807 కుటుంబాల్లో 199143 పిల్లలను గుర్తించినట్లు వెల్లడించారు. వీరిలో ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి మాత్ర తినిపించే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు ఎంత మందికి మాత్రలు వేశారు, ఎంతమందికి వేశారు అనే నివేదికను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
మాత్రల పంపిణీకి 1,815 మంది ఆశ, అంగన్వాడీ, హెల్త్ వర్కర్లు, ఇతర వలంటీర్లను, 59 మంది సూపర్వైజర్లను ఏర్పాటు చేశామన్నారు.
2 లక్షల 27 వేల మాత్రలు అల్బెండజోల్ మాత్రలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలు సంయుక్త ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
పిల్లలకు మాత్రలు వేసేటప్పుడు వారి తల్లిదండ్రుల ద్వారానే మాత్రలు వేసేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులు, మున్సిపాల్టీల్లో కౌన్సిలర్లు ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న డిఎంహెచ్వో సుధాకర్ లాల్ మాట్లాడుతూ పిల్లలు బహిర్భూమి కి వెళ్లడం, చేతులు శుభ్రముగా కడుక్కోకుండా భుజించడం వల్ల వ్యాధిగ్రస్తులు అవుతారని తెలిపారు. ఈ వ్యాధి సోకిన పిల్లలు కడుపులో నొప్పి రావడం, సరిగ్గా భోజనం చేయకపోవడం, బలహీనులుగా రక్తహీనతతో బాధ పడుతుంటారన్నారు.
తద్వారా పాఠశాలకు సరిగ్గా వెళ్ళకపోవడం, చురుకుగా ఉండకపోవడం వంటి అనర్థాలకు దారి తీస్తుందన్నారు. దీనిని నివారించడానికి నులిపురుగుల నివారణ మాత్రలు ప్రతి పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవని తెలియజేసారు. పిల్లలు అనారోగ్యంతో ఉండటం లేదా కోవిడ్ వచ్చిన ఇళ్లల్లో మాత్రమే ఈ మాత్రలు ఇప్పుడు ఇవ్వకూడదని వీరికి తర్వాత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, డిఆర్డిఓ నర్సింగరావు, సంక్షేమ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.