ఎర్ర బంగారం(మిర్చి) ఘాటెక్కింది. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పైపైకి దూసుకెళ్లింది. నిన్నటి వరకు రూ.25 వేల నుంచి రూ.28 వేలకు పరిమితమైన మిర్చి ధర ఒక్కసారిగా రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఏకంగా క్వింటా రూ.32వేలు పలికి రికార్డు క్రియేట్ చేసింది. దేశీ రకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్ కు 32 వేల రూపాయల ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఇంతటి గరిష్ఠ ధర నమోదు కావడం ఇదే ఫస్ట్ టైమ్ అని వ్యాపారులు చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలం కర్కెపల్లికి చెందిన భిక్షపతి 10 బస్తాలు మార్కెట్ కు తీసుకురాగా కాకతీయ ఆడ్తి వ్యాపారి ద్వారా లక్ష్మీసాయి ట్రేడర్స్ ఖరీదుదారు క్వింటా మిర్చి రూ.32 వేల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రైతును ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ సన్మానించింది.. ఊహించని విధంగా తాను పంచించిన మిర్చికి అధిక ధర లభించడం పట్ల రైతు ఆనందం వ్యక్తం చేశాడు.