ఆంధ్రప్రదేశ్ లో పర్యవేక్షణ లోపం కారణంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో దేవాదాయశాఖ ఆధీనంలో 4లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని, అయితే ఆలయాల ఆస్తులు కొన్ని అన్యాక్రాంతమయ్యాయన్నారు.
ఆలయాలను, ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు. శుక్రవారం నాడు అభిషేకసేవలో తిరుమల శ్రీవారిని చిన్నజీయ్యర్ స్వామి దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో స్వామీజీ మాట్లాడుతూ.. దేవాలయాలను పరిరక్షించాల్సిన వారు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదని అన్నారు.
రాయలసీమలో దాడులు జరిగిన 27 ఆలయాలను పరిశీలించానని, ఈ ఆలయాలలోని 17 ఆలయాలలో అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో ఓ విఙ్ఞాపన పత్రాన్ని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి అందజేసినట్లు తెలిపారు.
తన విఙ్ఞాపన పట్ల సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు.