భారత్తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం మరో కొత్త డ్రామాకి తెరతీసింది. సరిహద్దు ప్రాంతాల్ని మరింతగా ఆక్రమించుకోవడానికి వీలుగా సరిహద్దు భూ చట్టానికి ఆమోదముద్ర వేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.
సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, సరిహద్దు ప్రాంతాల రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. మొత్తం 14 దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటున్న చైనాకి ప్రస్తుతం భారత్, భూటాన్ లతోనే సమస్యలున్నాయి. మిగిలిన 12 దేశాలతో సరిహద్దు సమస్యల్ని ఆ దేశం పరిష్కరించుకుంది.