పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్నేత చింతమనేని ప్రభాకర్ శనివారం ఏలూరులోని జిల్లా కారాగారం నుంచి విడుదలయ్యారు. జైలు సమీపంలో ఉన్న దర్గాలో పూజలు చేసిన చింతమనేని అనుచరులతో కలిసి ఇంటికి వెళ్లారు. జిల్లా జైలు నుంచి ఆయన వెళ్లే దారిలో పోలీసులు భారీగా మోహరించారు. రూ.50వేల పూచీకత్తు చొప్పున ఇద్దరు జామీను సమర్పించిన అనంతరం చింతమనేనిని జైలు నుంచి విడుదల చేశారు.
చింతమనేనిని జైలు నుంచి ఇంటి వరకు ర్యాలీగా తీసుకెళ్లాలని తెదేపా శ్రేణులు తొలుత భావించాయి. కానీ, జిల్లాలో శనివారం నుంచి పోలీసు యాక్ట్-30 అమల్లో ఉందని, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించడంతో తెదేపా కార్యకర్తలు ర్యాలీ నిర్ణయాన్ని ఉపసంహరించకున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో ఫోన్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.