ఒక రాజకీయ పార్టీ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు నాగబాబు స్పష్టత ఇచ్చారు. చిరంజీవి తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టారని, కళారంగానికే జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ఈ మేరకు బుధవారం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నాగబాబు వీడియోను పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నారు. ఆయన కావాలనుకుంటే దేశంలో ఏ పార్టీ అయినా ఘనస్వాగతం పలికి రాజ్యసభ సీటు ఇస్తుంది.
రాజ్యసభ సీటు కోసం వెళ్లాల్సిన అవసరం అన్నయ్యకు లేదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఆయనకు అలాంటి ఆలోచనే ఉండి ఉంటే ఇలా అనుకుంటున్నాను తమ్ముడు అని ఓపినియన్ నాతో చెప్తారు. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు, పల్లాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానమైన సెంట్రల్ మినిస్టర్ పదవి అలంకరించారు. చిరంజీవి ఏ రాజకీయ పార్టీకి సపోర్టు చేయడం లేదు.
రాజకీయాల్లో అన్నాదమ్ములు ఇద్దరు ఉండకూడదు. ఎవరో ఒక్కరే ఉండాలి. కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే తాను రాజకీయాల్లో ఉండకూడదని ఎప్పుడో నిర్ణయం తీసుకొని త్యాగం చేశారు. త్యాగం అని ఎందుకు అన్నానంటే.. కళ్యాణ్ బాబుకు ఉన్న డెడికేషన్ చూసి తనకన్నా కళ్యాణే బాగా చేయగలుగుతాడు అని అనుకున్నారు.
అలా అన్నయ్య పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన నిర్ణయాన్ని కుటుంబం మొత్తం స్వాగతించాం. చిరంజీవి కి ఒక రాజకీయ పార్టీ నుంచి రాజ్యసభ సీటు లభిస్తోందని వస్తున్న వార్తలను ఎప్పటినుంచో ఖండించాలని అనుకున్నాను. కానీ ఇదే సరైన సమయమని ఇప్పుడు ఖండిస్తున్నాను అని అన్నారు.