క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. నేటి ఉదయం 7 గంటలకు గుంటూరులోని ఆయన స్వగృహంలో మృతిచెందారు. బాత్రూమ్లో గుండెపోటుతో కుప్పకులారు జయప్రకాష్రెడ్డి. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
కరోనా కారణంగా సినిమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూలో ఉంటున్నారు. రాయలసీమ మాండలీకంతో విలనిజం పండించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి. కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు
జయప్రకాష్రెడ్డి.. తండ్రి సాంబిరెడ్డి.. సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట ఉన్నత పాఠశాలలో చేరాడు. పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది.
అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆయనకు ఆసక్తి. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారని చెబుతారు..
చదువులోనూ ముందుండే వాడు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. ఇక, ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు.
అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు.
ఓవైపు ప్రతినాయకుడిగా.. మరోవైపు కమెడియన్గా… కొన్నిసార్లు తండ్రిగా.. మామగా.. ఇలా పలు రకాల పాత్రలు పోషించి.. తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు జయప్రకాష్రెడ్డి. అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు టాలీవుడ్ చాలా మందితో కలిసి నటించారు జయప్రకాష్రెడ్డి.
ఎంత పెద్ద సినీనటుడు అయినా నటకరంగాన్ని ఆయన వదిలి పెట్టలేదు. తరచూ నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. సినిరంగం కన్నా నాటకరంగమంటేనే తనకు మక్కువ అని ఒకానొక సందర్భంలో జయప్రకాష్ రెడ్డి చెప్పారు.