ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెల 15 నుంచి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసే సీటింగ్ కెపాసిటీతో సినిమా ధియేటర్లు తెరుచుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం
ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
దేశంలోని చాలా రాష్ట్రాలలో సినిమా ధియేటర్లను ఇప్పటికే తెరిచారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఫిలిం చాంబర్స్లో నేడు ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అధ్యక్షుడు కే.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ గత ఏడు నెలలుగా సినిమా రిలీజ్లు లేక నష్టాల్లో కూరుకుపోయామని విద్యుత్ బకాయిలు రద్దు చేసి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరామని బకాయిలు రద్దు చేస్తామని ఆయన చెప్పారు.
అయితే ఇంకా అవి రద్దు కాలేదు అని అన్నారు. మంత్రి పేర్ని నాని తో చర్చలు జరుగుతున్నాయని, సమస్యలు పరిష్కరించనంత వరకు సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేదని ప్రసాద్ తెలిపారు. అందుకే రేపటి నుంచి సినిమా హాళ్లు తెరవకూడదని నిర్ణయించామని కేఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.
‘లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లపైన వేసిన కరెంట్ బిల్లులు రద్దు చేయాలి. మా సమస్యలను చిరంజీవి నాగార్జున సహకారంతో ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లాం’ అని ఆంధ్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్ల సెక్రటరీ గోరంట్ల బాబు అన్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ఆఫ్ కామర్స్ సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో థియేటర్లకి కరెంట్ మినిమమ్ చార్జీలు వేశారు.
ఒక్కో థియేటర్కు ఈ 7 నెలల కాలం లో 4 లక్షల రూపాయలు అవుతుంది. ఇపుడు ఉన్న పరిస్థితిలో ఒక్కో థియేటర్ ఓపెన్ చేయటానికి 10 లక్షల ఖర్చవుతుంది. కరోనా కారణంగా 500 థియేటర్లు కరెంట్ బకాయిలు కట్టలేదు. నిర్వహణ చార్జీలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం.
కరెంట్ ఫీజులు రద్దు చేయండి. ఆక్యుపెన్సీ విషయంలో కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలని ఆయన కోరారు.