ఎప్పుడెప్పుడు భారీ తెరపై సినిమా చూద్దామన్న సగటు ప్రేక్షకుడి కోరిక నెరవేరనుంది. సినిమా థియేటర్లు తెరుచుకోనుండటంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ చలన చిత్రాల ప్రదర్శనకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సినిమా విడుదలతో పునఃప్రారంభం కానున్నాయి.
నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకల సందర్భంగా ఎక్కువగా సినిమాలు విడుదలవుతుంటాయి. నేడు కొత్త సినిమా విడుదలతో థియేటర్ పునర్ ప్రారంభం కానున్నాయి.
సంక్రాంతి పండగ నాటికి జిల్లాలో అన్ని తెరుచుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.
సినిమా ప్రారంభానికి ముందు, ప్రదర్శన ముగిసిన అనంతరం శానిటైజేషన్ చేయడం, 50 శాతం మంది ప్రేక్షకులనే లోపలికి అనుమతించడం, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలనే నిబంధనలను ప్రభుత్వం విధించింది.
వీటిని పాటించేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి చివర్లో థియేటర్లలో చిత్రాల ప్రదర్శనను ప్రభుత్వం నిలిపివేసింది.
దీంతో సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. లాక్డౌన్ అనంతరం సినిమా షూటింగ్లు ప్రారంభమైనా ఇవి మాత్రం తెరుచుకోలేదు.
ఎట్టకేలకు ఇటీవల సర్కారు పచ్చజెండా ఊపడంతో చిత్రాల ప్రదర్శన షురూ కానుంది.