ఎడ్ల బండ్ల ఇసుక కార్మికులకు ఉపాధి భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా నాయుకులు టి.తిరుపతిరావు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంతెన హరనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం శ్రీకాకుళం సిఐటియు జిల్లా కార్యాలయంలో శ్రీ అసిరితల్లి ఎడ్ల బండ్ల కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో ఎడ్ల బండ్లు కార్మికులు గత 50సంవత్సరాలుగా ఎడ్ల బండ్లుతో ఉపాధి పొందుతున్నారని అన్నారు.
ఎండ్ల బండ్లకు ప్రభుత్వం కేసులు పెట్టి ఎడ్ల బండ్లు ఆపేయడంతో ఉపాధి లేక 300 ఎడ్లు బండ్లు కార్మికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు దాణా కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఎడ్ల బండ్లుతో చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక వేస్తారని ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు.
ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎడ్లు బండ్లు ఇసుక కార్మికులకు ఆంక్షలు విధించకుండా ఎడ్ల బండ్లు కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 23 తేదీన జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీ అసిరితల్లి ఎడ్ల బండ్లు కార్మిక సంఘం నాయుకులు సి.హెచ్.శ్రీనివాస్ ఎస్.వెంకటరమణ, ఎ.సాయి, పి.అసిరితల్లి, ఎమ్.శ్రీను, కె.చంద్రశేఖర్, నక్క ఆదినారాయణ, పొలయ్య, తదితరులు పాల్గొన్నారు.