ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సీఐటీయూ జండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి.భాస్కర్ మాట్లాడుతూ 1970 మే 30న సిఐటియు కార్మిక సంఘం ఏర్పడిందని తెలిపారు.
ఏర్పడిన రోజు నుండి నేటి వరకు 51 సంవత్సరాలుగా కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ కార్మికుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. సిఐటియు కార్మిక సంఘం అనేది పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.
స్పష్టమైన అవగాహనతో కార్మిక వర్గ పోరాట నిర్వహిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక రంగాలలో సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం పట్ల ఇప్పటికే అనేక విజయాలు సాధించి ముందుకు సాగుతుందని తెలిపారు.
దేశంలోని కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ దేశవ్యాప్తంగా అనేక సార్వత్రిక సమ్మెలు నిర్వహించిన చరిత్ర సిఐటియు కు ఉన్నదని కొనియాడారు.
ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మత వైషమ్యాలు రెచ్చగొడుతూ కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ దోపిడీదారులకు దేశ సంపదను దోచిపెడుతుందని విమర్శించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ప్రజలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సరైన వైద్యం అందించలేక పోతున్నాయని అన్నారు.
కనీసం వ్యాక్సిన్ కూడా సంపూర్ణంగా ఇవ్వలేని దుస్థితిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. కరోనా మహమ్మారి నుండి దేశాన్ని ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్ ను మరింత ఉత్పత్తి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకొని, ప్రైవేట్ హాస్పిటల్ లో అక్రమ ఆర్థిక దోపిడిని నిలువరించి, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటినీ జాతీయం చేసే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కరోనా నిర్మూలన జరిగేంత వరకు ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి రాని కుటుంబాలకు నెలకు 7500 రూపాయలు,ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు ఆరు నెలల పాటు ప్రభుత్వమే ఉచితంగా అందించి ప్రజలను ఆదుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు భత్తుల రాజు,శ్రీశైలం, శ్రీనివాస్,నరసయ్య,రమేష్, బాలరాజు, ఎలందర్,మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.