సీజనల్ వ్యాధుల నివారణ కోసం రాష్ట్ర పురపాలక శాఖమంత్రి కేటీఆర్ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు” కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండలో తన నివాసంలోని తొట్టెలు, పూల కుండీలలో చెత్తను, ఎండిన ఆకులను తొలగించి తాజా నీటితో నింపారు.
ఈ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి నల్గొండలోని నివాసంలో క్లినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి లోపల, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. పరిశుభ్రత ప్రాధాన్యత తెలుసు కాబట్టే అభివృద్ది చెందిన దేశాలలో దీన్ని క్రమశిక్షణతో నిరంతరం పాటిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం అత్యధిక నిధులను కేటాయిస్తున్నారని ఈ కార్యక్రమాల ద్వారా అన్ని పల్లెలు, పట్టణాలు క్లీన్ అండ్ గ్రీన్ గా మారాయి అని తెలిపారు.
ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే సీజన్ లలో వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుకోవచ్చునని ఆయన సూచించారు. కేటీఆర్ చేపట్టిన కార్యక్రమాన్ని మంచి అవకాశంగా భావించి పట్టణాలు, నగరాలలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి చెప్పారు.
తమ ఆరోగ్యం కోసం వారంలో పది నిమిషాలు కేటాయించడం పెద్ద ఇబ్బంది కాదునని, ప్రతి ఆదివారం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అందరు కూడా తప్పకుండా క్లీనింగ్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. జబ్బులు వచ్చిన తరువాత లక్షలు ఖర్చు చేయడం కన్నా ముందస్తు శుభ్రతతో అంటువ్యాధులు బారిన పడకుండా తమని తాము కాపాడుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.